Wednesday 24 October 2012

అల్లు అరవింద్ 'గీతా ఆర్ట్స్‌' నెక్ట్స్ చిత్రం ఖరారు


హైదరాబాద్ : పరిశ్రమలో అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్‌ సంస్థ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు మెగా హిట్స్ అయ్యాయి. అయితే తమ సొంత కుటుంబ హీరోలతోనే ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తూంటారు. తాజాగా ఈ బ్యానర్ పై మరో చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి మేనల్లుడు సాయిధర్మతేజ్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది‌. ఇతనితో గీతా ఆర్ట్స్‌ సంస్థ ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నిర్మించబోతోంది
గతంలో గోపీచంద్ తో 'యజ్ఞం' చిత్రం రూపొందించిన ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తారు. అల్లు అరవింద్‌, దిల్‌ రాజు నిర్మాతలు. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. నిర్మాతలు మాట్లాడుతూ ''వినోదంతో పాటు యువతరానికి నచ్చే అంశాలు ఉన్న కథ ఇది. శ్రీహరి ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ చిత్రానికి స్వరకర్త'' అన్నారు. సాయిధర్మతేజ్‌కిది రెండో చిత్రం. ప్రస్తుతం వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో 'రేయ్‌'లో నటిస్తున్నారు.
.ప్రస్తుతం ‘రేయ్' చిత్రం ఫైనల్ స్టేజిలో ఉంది. ట్రినిడాడ్-టొబాగోల్లో షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర యూనిట్ తర్వాతి పోర్షన్ పూర్తి చేయడానికి లాస్ వెగాస్ బయల్దేరి వెళ్లారు. ఈ చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో పర్మినెంట్ రోల్ పోషిస్తోంది.
వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమాపై అంచనాలు పెంచేందుకు ఈచిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లను సంబంధించిన విషయాలు పొందు పరుస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment